భారత్, చైనాలపై నేపాల్ మంత్రి ఆసక్తికర పోలిక.. రెండూ ముఖ్యమేనని స్పష్టం

Nepal Minister interesting comparison on India and China says both are important
  • తండ్రి స్థానంలో తల్లిని, తల్లి స్థానంలో తండ్రిని భర్తీ చేయలేమన్న నేపాల్ విదేశాంగ మంత్రి
  • భారత్, చైనాలతో తమ సంబంధాలు ప్రత్యేకమైనవని వెల్లడి
  • దేశ వాణిజ్యంలో మూడింట రెండొంతులు భారత్‌తోనేనని స్పష్టీకరణ
  • చైనా బీఆర్ఐ నుంచి ఒక్క డాలర్ కూడా రాలేదని వ్యాఖ్య
భారత్, చైనాలతో తమ దేశ సంబంధాలపై నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి స్థానాన్ని తండ్రి, తండ్రి స్థానాన్ని తల్లి భర్తీ చేయలేరని, ఈ రెండు దేశాలతో తమకు ఉన్న అనుబంధం అటువంటిదేనని ఆయన పేర్కొన్నారు. ఖాట్మాండులో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో భారత్, చైనాలతో సమతుల్య దౌత్యంపై ఎదురైన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

నేపాల్‌ను చైనా తన గుప్పిట్లోకి తీసుకుందంటూ భారత మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తోసిపుచ్చారు. తమ విదేశాంగ విధానం భావోద్వేగాల ఆధారంగా కాకుండా, కేవలం దేశ ప్రయోజనాల ప్రాతిపదికన ఉంటుందని స్పష్టం చేశారు. నేపాల్ మొత్తం వాణిజ్యంలో మూడింట రెండొంతులు వాటా కేవలం భారత్‌తోనే జరుగుతోందని, ఈ విషయంలో మరో దేశం దరిదాపుల్లో కూడా లేదని ఆయన గుర్తుచేశారు.

చైనా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒప్పందంపై కూడా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. 2017లో ఒప్పందం కుదిరినప్పటికీ, గత పదేళ్లలో బీఆర్ఐ ప్రాజెక్టుల కింద తమకు ఒక్క డాలర్ నిధులు కూడా అందలేదని స్పష్టం చేశారు. నేపాల్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఇంధనం, పర్యాటకం, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాల్లో భారత కంపెనీలు ముందుకు రావాలని ఆయన ఆహ్వానించారు. ఈ మేరకు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.
Advertisement
Shishir Khanal
Nepal India Relations
Nepal China Relations
Belt and Road Initiative Nepal
India Nepal Trade

More Telugu News