నేపాల్ వరదలు: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో హెల్ప్‌లైన్!

Telangana Government sets up Delhi helpline for citizens stranded in Nepal floods
  • నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు అండ
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలో ప్రత్యేక కేంద్రం
  • విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం
  • సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ల విడుదల
నేపాల్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో, అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించనున్నారు.

ఈ కేంద్రం ద్వారా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, బాధితుల విజ్ఞప్తులపై తక్షణమే స్పందిస్తామని అధికారులు తెలిపారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, యాత్రికులు, పర్యాటకులతో సంబంధాలు తెగిపోయిన వారు ఈ హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

సహాయం కోరే వారు బాధితుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో వారు చివరిగా ఉన్న ప్రదేశం, టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు సమాచారాన్ని అందించాలని అధికారులు కోరారు. హెల్ప్‌లైన్ నంబర్లు: సహాయం అవసరమైన వారు రెసిడెంట్ కమిషనర్ పీ.ఎస్. వందన (9871999044), పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సి.హెచ్. చక్రవర్తి (9949351270), లైజన్ ఆఫీసర్ జి. రక్షిత్ నాయక్ (9618597969) నంబర్లలో సంప్రదించాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Advertisement
Telangana Government
Nepal Floods
Revanth Reddy
Delhi Helpline
Telangana Bhavan Delhi
Nepal Rescue Operations

More Telugu News