ఓటర్ల జాబితా సవరణ: ఫేక్ డాక్యుమెంట్లపై ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక

Voter list revision Election Commission warns against fake documents
  • ఓటర్ల జాబితా సవరణలో తప్పుడు పత్రాలిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
  • తెలంగాణ ఓటర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి హెచ్చరిక
  • రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ
  • తప్పుడు సమాచారమిస్తే జైలు శిక్ష తప్పదని స్పష్టం
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని, నకిలీ పత్రాలను సమర్పించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన ఆయన స్పష్టం చేశారు.

ఓటర్లు సమర్పించే పత్రాలను, డిక్లరేషన్లను అధికారులు స్వతంత్రంగా ధ్రువీకరిస్తారని సీఈఓ కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వ అధికారికి తప్పుడు సమాచారం అందించడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 217 ప్రకారం శిక్షార్హమని పేర్కొన్నారు. అదేవిధంగా, ఓటర్ల జాబితా సవరణలో తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 ప్రకారం జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 2 లక్షల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద 92.8 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అందజేయనున్నారు. వీరిలో 60.5 లక్షల మంది ఓటర్ల డేటాలో వ్యత్యాసాలు ఉండగా, మరో 32.3 లక్షల మంది వివరాలు 2002 ఓటర్ల జాబితాతో సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు.

విచారణ సమయంలో ఓటర్లు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ వివరాల స్థితిని ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, ఎపిక్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ ద్వారా స్వయంగా ధ్రువీకరించుకోవచ్చని వెల్లడించారు.
Advertisement
Telangana Chief Electoral Officer
Voter List Revision
Fake Documents Warning
Election Commission of India

More Telugu News