‘వందేమాతరం’పై కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ కీలక ప్రకటన

DK Shivakumar makes key announcement on Vande Mataram in Karnataka
  • రెండు చరణాలే పాడతామన్న సీఎం
  • కాంగ్రెస్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటన
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆరు చరణాలు ఆలపించిన వైనం
  • అది తనకు తెలియకుండా జరిగిందన్న సీఎం డీకే
  • ప్రతి వర్గాన్ని గౌరవించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని వ్యాఖ్య
కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ పూర్తి గేయాన్ని ఆలపించబోమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నిర్ణయం మేరకు తొలి రెండు చరణాలు మాత్రమే పాడతామని తెలిపారు. ఈ విషయంలో పార్టీ వైఖరికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మొత్తం ఆరు చరణాలు ఆలపించడంపై ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే ఆ నిర్ణయం జరిగి ఉండొచ్చని శివకుమార్‌ అన్నారు. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం గతంలో నిర్ణయించిన విధంగానే తొలి రెండు చరణాలు మాత్రమే పాడతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఇటీవల 1937లో తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమర్థించింది. బహిరంగ, జాతీయ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని అప్పట్లో నిర్ణయించినట్లు పేర్కొంది. మొత్తం చరణాలు పాడాలంటూ కొత్త వందేమాతరం బిల్లు రావడం నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది.

కాంగ్రెస్‌ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. జాతీయ గేయాన్ని అవమానిస్తున్నారని విమర్శించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్‌ పాల్పడుతోందని ఆరోపించింది.

ఈ విమర్శలపై శివకుమార్‌ స్పందించారు. భారత్‌ భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలతో కూడిన దేశమని అన్నారు. ప్రతి వర్గాన్ని గౌరవించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని చెప్పారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

వందేమాతరం తరువాతి చరణాల్లో దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉందని కాంగ్రెస్‌ చెబుతోంది. ఇతర వర్గాలకు అవి అభ్యంతరకరంగా ఉండొచ్చన్న కారణంతో తొలి రెండు చరణాలకే పరిమితం కావాలని నిర్ణయించింది. కర్ణాటకలోనూ ఇదే నిర్ణయం అమలవుతుందని శివకుమార్‌ స్పష్టం చేశారు.
Advertisement
DK Shivakumar
Vande Mataram Karnataka
Karnataka Government National Song
Congress BJP Vande Mataram Row
Vande Mataram Two Stanzas
Karnataka Political News

More Telugu News