ఏకాంత నిర్బంధం వల్లే నా ఆరోగ్యం క్షీణించింది: ఆసుపత్రిలో సోదరి ఉజ్మా ఖాన్తో ఇమ్రాన్ ఖాన్
- కోర్టు ఆదేశాలతో ఆసుపత్రిలో ఇమ్రాన్ ఖాన్ కు వైద్య పరీక్షలు
- ఇమ్రాన్ తో మాట్లాడిన ఆయన సోదరి ఉజ్మా ఖాన్
- ఒంటరిగా ఉంచడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్న వైద్య నిపుణులు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కోర్టు ఆదేశాల మేరకు అడియాలా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాన్ స్పందిస్తూ... నిరంతరం డెత్ సెల్లో ఉంచి, బయటి ప్రపంచంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడనివ్వకుండా సుదీర్ఘకాలం పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచడం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని తన సోదరుడు తనతో చెప్పారని తెలిపారు. ఇది తనకు ఎంతో ఆవేదన కలిగిస్తోందని చెప్పారు.
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ను సుదీర్ఘంగా ఒంటరిగా ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి బీపీ, గుండె సంబంధిత తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్రాన్ కు పూర్తిస్థాయి మెరుగైన వైద్యం అందించాలని, రాజకీయ కక్షసాధింపులకు స్వస్తి చెప్పాలని పీటీఐ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.