ఆటో కార్మికుల రాష్ట్ర వ్యాప్త బంద్ ను విజయవంతం చేయండి: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy calls for success of statewide auto workers strike
  • ఈ నెల 24న ఆటో కార్మికుల రాష్ట్ర వ్యాప్త బంద్
  • తన క్యాంప్ కార్యాలయంలో బంద్ పోస్టర్ ను ఆవిష్కరించిన జగదీశ్ రెడ్డి
  • ఆటో కార్మికుల రక్షణకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 24న చేపట్టబోయే ఆటో కార్మికుల రాష్ట్ర వ్యాప్త బంద్ పోస్టర్‌ను బీఆర్‌టీయూ నాయకులు, ఆటో డ్రైవర్లతో కలిసి సూర్యాపేటలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.


ఆర్టీసీ యాజమాన్యానికి ఈ-ఆటోలను కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని, ఆటో కార్మికుల రక్షణకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలను పెంచడంతో పాటు ఓలా, ఉబర్, రాపిడోలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే సొంతంగా యాప్‌ను ప్రారంభించాలని సూచించారు. బైక్ టాక్సీల అక్రమ రవాణాను అరికట్టాలని, ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు వారిని ఈ-చలాన్ల నుంచి మినహాయించాలని కోరారు.

హైదరాబాద్‌లో ఇతర జిల్లాల ఆటోల అక్రమ రవాణాను అరికట్టాలని, వాహన సారథి లైసెన్స్ విధానాన్ని కొనసాగిస్తూ జీవో 60 ప్రకారం రేడియం స్టిక్కరింగ్ నుంచి ఆటోలకు మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆటో కార్మికులకు ప్రమాద బీమాతో పాటు సాధారణ మరణాలకు కూడా బీమా వర్తింపజేయాలని, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 24న నిర్వహించే బంద్‌కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Jagadish Reddy
Auto Workers Strike
Telangana Auto Bandh
Auto Drivers Welfare Board
Suryapet MLA
BRS Party

More Telugu News