వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్ దూకుడు... పతకం ఖాయం

Gayatri Gopichand aggressive performance in World Championship medal confirmed
  • ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కు గాయత్రి-ట్రీసా జోడీ
  • 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్‌లో భారత్‌కు పతకం ఖాయం
  • క్వార్టర్స్‌లో చైనా జోడీపై హోరాహోరీ పోరులో గెలిచిన భారత ద్వయం
  • 2011లో చివరిసారి పతకం సాధించిన గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప
భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒకటిన్నర దశాబ్ద కాలంగా సాగుతున్న నిరీక్షణకు తెరపడింది. యువ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీ ద్వయం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల డబుల్స్‌ విభాగంలో సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా వీరు ఈ చారిత్రక ఘనతను సొంతం చేసుకున్నారు.

ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్‌ పోరులో గాయత్రి - ట్రీసా జోడీ, చైనాకు చెందిన జియా యిఫాన్ - జాంగ్ షుక్సియాన్‌ జంటపై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌ను 16-21 తేడాతో కోల్పోయినప్పటికీ, భారత ద్వయం అసాధారణ రీతిలో పుంజుకుంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-15, 21-13 స్కోరుతో వరుసగా కైవసం చేసుకుని మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టిన భారత జోడీ, కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణులు పతకం సాధించడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 2011లో గుత్తా జ్వాల - అశ్విని పొన్నప్ప జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన గాయత్రి, ట్రీసాతో కలిసి బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. ఒకవేళ సెమీ ఫైనల్‌లోనూ విజయం సాధిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా వీరు సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.
Advertisement
Gayatri Gopichand
Treesa Jolly
World Badminton Championships
Womens Doubles Badminton
Indian Badminton Players

More Telugu News