సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటనకు అందుకే అనుమతి ఇవ్వలేదు.. విదేశాంగ శాఖ క్లారిటీ

MEA on no permit for Telangana CM Revanth Reddy to US Trip
  • రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు ఎంఈఏ అనుమతి నిరాకరణ
  • పర్యటన కార్యక్రమం హోదాకు, ఉద్దేశానికి తగినట్లు లేదని కేంద్రం స్పష్టీకరణ
  • విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వెల్లడి
  • అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సీఎంవో ప్రకటన
  • ప్రస్తుతం లండన్‌లో ఉన్న రేవంత్‌ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) శుక్రవారం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి హోదాకు, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా కార్యక్రమం లేదని భావించడంతో అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించినట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు వారి కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని జైస్వాల్‌ చెప్పారు. సంబంధిత పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా కార్యక్రమం ఉండాలని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో ఆ ప్రమాణానికి అనుగుణంగా కార్యక్రమం లేదని, అందుకే రాజకీయ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బ్రిటన్‌ పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చినట్లు గుర్తుచేశారు.

రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఆగస్టు 30న హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ముందే హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అమెరికా పర్యటనలో ఆయన ‘తెలంగాణ రైజింగ్‌’ ప్రతినిధి బృందంతో కలిసి పెట్టుబడిదారులను కలవాల్సి ఉన్నట్లు తెలంగాణ సీఎంవో వెల్లడించింది. ఈ పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించడంతో పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
Advertisement
MEA
Telangana
Revanth Reddy
USA
US Tour
US Trip

More Telugu News