రాయలసీమ వనరులు తీవ్రంగా దోపిడీకి గురయ్యాయి: పీవీఎన్ మాధవ్
- రైజింగ్ రాయలసీమ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్
- ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది సీఎంలు వచ్చారని వ్యాఖ్య
- రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని పిలుపు
కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో సమర్థ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీమ ప్రాంత స్థితిగతులు, ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రాయలసీమ ప్రాంతం తీవ్ర వెనుకబాటుతనానికి గురైందని, ఇక్కడి ప్రాకృతిక, మానవ వనరులు దోపిడీకి గురయ్యాయని అన్నారు.
ఈ ప్రాంతం నుంచి ఎందరో ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. రాయలసీమ అభివృద్ధిలో ఎందుకు వెనుకబడిపోయిందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు నాయకులు, మేధావులు ఒకే తాటిపైకి వచ్చి సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని పిలుపునిచ్చారు.