అశ్వారావుపేట అభివృద్ధే ధ్యేయం: మంత్రి తుమ్మల
- తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన తుమ్మల
- ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని సూచన
- రైతులు తక్షణమే మొక్కలను సరఫరా చేయాలని ఆదేశం
అశ్వారావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని, రైతులకు తక్షణమే మొక్కలు సరఫరా చేయాలని సూచించారు. అటవీ, రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వే నిర్వహించి పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టు కాలువల తవ్వకంలో భూసమస్యల నివారణకు సబ్ కెనాల్స్ బదులు పైప్లైన్ వ్యవస్థను పరిశీలించాలని సూచించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.