అమరావతి ఐకానిక్ భవనాల నిర్మాణాలు గడువు ప్రకారం పూర్తి కావాలి: మంత్రి నారాయణ
- ఐకానిక్ భవానాల నిర్మాణ పనులు పురోగతిపై నారాయణ సమీక్షా సమావేశం
- నిర్మాణాలు ఏయే దశల్లో ఉన్నాయో అధికారుల నుంచి తెలుసుకున్న నారాయణ
- వర్షాల కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి
రాజధాని అమరావతి పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో కలిసి పనుల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సమావేశంలో ఏజీఐసీఎల్ ఎండీ అభిషేక్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల్రెడ్డితో పాటు పలువురు చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. అమరావతి ల్యాండ్మార్క్లుగా నిలవనున్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణ పనులు ఏయే దశల్లో ఉన్నాయనే వివరాలను నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం దృష్ట్యా నిర్మాణాలు నిలిచిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.
ప్రభుత్వం నిర్దేశించిన గడువు (టార్గెట్స్) ప్రకారమే రాజధాని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఎక్కడా నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రాక్ట్ సంస్థలకు, అధికారులకు మంత్రి నారాయణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.