యూపీఐలో పెద్ద మార్పు.. ఇక ప్రతి చెల్లింపూ ఒక్క క్లిక్‌తో కాదు!

UPI new security measures proposed to RBI to stop fraud
  • యూపీఐ చెల్లింపులకు కొత్త భద్రతా ప్రతిపాదన
  • అనుమానాస్పద లావాదేవీలకు అదనపు నిర్ధారణ
  • రిస్క్‌ ఉన్న వాటికే వర్తింపు
  • పెరుగుతున్న డిజిటల్‌ మోసాల నేపథ్యంలో నిర్ణయం
  • వేగం తగ్గకుండా భద్రత పెంచాలని బ్యాంకుల లక్ష్యం
  • ప్రతిపాదనను పరిశీలిస్తున్న ఆర్‌బీఐ
యూపీఐ చెల్లింపుల్లో త్వరలో కొత్త భద్రతా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. డిజిటల్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద లావాదేవీలకు అదనపు నిర్ధారణ విధానాన్ని తీసుకురావాలని బ్యాంకులు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌కు (ఆర్‌బీఐ) ప్రతిపాదించాయి. దీనికి ఆమోదం లభిస్తే ప్రమాద సూచనలు ఉన్న కొన్ని యూపీఐ చెల్లింపులు ఒక్క క్లిక్‌తో పూర్తికావు. వినియోగదారుడి నుంచి మరోసారి స్పష్టమైన అంగీకారం తీసుకున్న తర్వాతే లావాదేవీ పూర్తవుతుంది.

బ్యాంకుల ప్రతిపాదన ప్రకారం.. మోసాల గుర్తింపు వ్యవస్థ ఏదైనా లావాదేవీని అనుమానాస్పదంగా గుర్తిస్తే వినియోగదారుడి స్క్రీన్‌పై ‘Yes/No’ నిర్ధారణ సందేశం కనిపిస్తుంది. వినియోగదారుడు ‘Yes’ ఎంచుకున్న తర్వాతే చెల్లింపు పూర్తవుతుంది. సాధారణ యూపీఐ లావాదేవీలకు ఈ అదనపు దశ ఉండదు. ప్రమాద సూచనలు కనిపించిన సందర్భాల్లో మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది.

ఇటీవల కాలంలో యూపీఐ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, నకిలీ కస్టమర్‌ కేర్‌ పేరుతో వినియోగదారులను మోసగించి డబ్బు బదిలీ చేయిస్తున్నారు. యూపీఐ చెల్లింపులు వెంటనే పూర్తవడం వల్ల డబ్బు వెళ్లిపోయిన తర్వాతే చాలామందికి మోసం జరిగిన విషయం తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను తగ్గించేందుకు చెల్లింపునకు ముందు కాసేపు ఆలోచించే అవకాశం కల్పించడమే ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశమని బ్యాంకులు భావిస్తున్నాయి.

అయితే అన్ని భారీ విలువ గల లావాదేవీలపై తప్పనిసరిగా ఆలస్యం విధించడం లేదా కూలింగ్‌ పీరియడ్‌ పెట్టడాన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. అలా చేస్తే యూపీఐ ప్రధాన బలమైన వేగం, సౌలభ్యం దెబ్బతింటాయని చెబుతున్నాయి. అందుకే ప్రతి లావాదేవీకి కాకుండా ప్రమాద సూచనలు ఉన్న వాటికే అదనపు నిర్ధారణ ఉండాలని సూచించాయి.

ఏ లావాదేవీ ప్రమాదకరమో బ్యాంకుల రిస్క్‌ అనాలిసిస్‌ వ్యవస్థ నిర్ణయిస్తుంది. అసాధారణంగా పెద్ద మొత్తం, తొలిసారి డబ్బు పంపుతున్న ఖాతా, కొత్త మొబైల్‌ పరికరం, కొత్త ప్రాంతం నుంచి లావాదేవీ జరగడం, గతానికి భిన్నంగా చెల్లింపు ఉండటం వంటి అంశాలను పరిశీలించి అనుమానాస్పదంగా గుర్తించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై ఆర్‌బీఐ పరిశీలన కొనసాగుతోంది. ఆమోదం లభిస్తే యూపీఐ చెల్లింపుల్లో భద్రత మరింత బలోపేతం కానుంది.
Advertisement
UPI
RBI
Digital Fraud
Payment Security
Cyber Crime Prevention
Banking Rules

More Telugu News