వీడని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసులు కీలక ప్రకటన
- కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై వీడని ఉత్కంఠ
- పాప ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించిన పోలీసులు
- చిన్నారి ఫొటోతో రాష్ట్రవ్యాప్తంగా వాల్పోస్టర్లు, కరపత్రాల పంపిణీ
- 25 రోజులుగా గాలిస్తున్నా లభించని చిన్నారి ఆనవాళ్లు
- కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేసినా దొరకని ఆధారాలు
ఈ మేరకు చిన్నారి ఫొటో, గుర్తింపు వివరాలతో కూడిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అంటిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. పాప గురించి తెలిస్తే 9440796508, 9440796531, 9440796573 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తుని పోలీసులు ప్రజలను కోరారు.
చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటివరకు 12 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అటవీ ప్రాంతంతో పాటు సమీపంలోని వాగులు, వంకలను జల్లెడపట్టాయి. అయినా చిన్నారి ఆనవాళ్లు లభించలేదు. మరోవైపు, జీడిపిక్కలు ఏరేందుకు సమీప గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చేవారికి పాప వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అడవి జంతువులు ఏమైనా దాడి చేశాయా? అనే అనుమానంతో బొమ్మను, మాంసాన్ని సంఘటనా స్థలంలో ఉంచి చూసినా ఫలితం లేకుండా పోయింది.
జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. పాపతో పాటు వెళ్లిన వారి పెంపుడు శునకం కూడా అదృశ్యమైంది. కొన్ని రోజులకు ఆ శునకం తిరిగి ఇంటికి చేరినప్పటికీ, దాని ద్వారా పాప ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ శునకం కూడా మృతి చెందింది.
పాప కనిపించకుండా పోయిన రోజు, ఆ శునకం ఊరిలోని ప్రధాన రహదారిపై ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు సమీపంలోని ఆలయ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కానీ, అది ఎటువైపు వెళ్లిందనే దానిపై స్పష్టత రాలేదు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పాప ఆచూకీ లభించకపోవడంతో, ఇప్పుడు ప్రజల నుంచి అందే సమాచారంపైనే పోలీసులు ఆశలు పెట్టుకున్నారు.