ఎయిడ్స్ బాధితురాలిపై అత్యాచారం కేసు.. నిందితుడు నిర్దోషిగా విడుదల!
- ముంబై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
- విచారణ సమయంలో అదృశ్యమైన బాధితురాలు
- పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
- తగిన ఆధారాలు లేకపోవడంతోనే విముక్తి
అసలేం జరిగిందంటే..
ఈ కేసు నేపథ్యం 2018 నాటి సంఘటనకు సంబంధించింది. అప్పట్లో 35 ఏళ్ల వయసున్న సదరు మహిళ తన భర్తతో గొడవపడి ఇల్లు వదిలి వచ్చేసింది. విఖ్రోలి బస్ స్టాప్ వద్ద ఆమె నిలబడి ఉండగా, నిందితుడు ఆమెను తన బస్సులో తీసుకెళ్తానని నమ్మబలికాడు.
బస్సును కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత, ఆమెకు మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి, స్పృహ కోల్పోయాక ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ.. పోలీస్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఆమెను రక్షించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2023లో నిందితుడిని అరెస్ట్ చేయగా, అతడు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు.
ఆధారాలు సరిపోవన్న న్యాయస్థానం
ఈ కేసు విచారణ సందర్భంగా స్పెషల్ జడ్జి సురేఖ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు, బాధితురాలు మాత్రమే ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయని.. కాబట్టి ఇందులో బాధితురాలి సాక్ష్యం అత్యంత కీలకమైన ఆధారమని కోర్టు పేర్కొంది.
అయితే, ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో ఎఫ్ఐఆర్ లోని అంశాలను నిరూపించే అవకాశం లేకుండా పోయిందని స్పష్టం చేసింది. దీనికి తోడు, సదరు మహిళకు ఎయిడ్స్ ఉన్నట్లు ఎలాంటి వైద్య నివేదికలను రికార్డుల్లో సమర్పించలేదని న్యాయమూర్తి గుర్తుచేశారు.
నిందితుడు ఆమెకు ముందే పరిచయం లేని వ్యక్తి అయినప్పటికీ, అతడిని గుర్తించేందుకు 'టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్' కూడా నిర్వహించలేదని తప్పుబట్టారు. అత్యాచారం జరిగిందని, మత్తు పదార్థాలు ఇచ్చారని లేదా అక్రమంగా నిర్బంధించారని నిరూపించడానికి తగిన ఆధారాలు లేకపోవడంతో, నిందితుడిని తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.