ఉమ్మడి ఆస్తి అమ్మకం.. ఈ విషయాలు తెలియకపోతే చిక్కులే!
- ఉమ్మడి ఆస్తిలో ఒక యజమాని మొత్తం ఆస్తిని అమ్మలేరు
- తన వాటాను మాత్రమే విక్రయించేందుకు చట్టం అనుమతిస్తుంది
- సహ యజమానుల అనుమతి లేకుండా అమ్మితే ఆ అమ్మకం చెల్లదు
- ఇటీవల ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది
- మోసపూరిత అమ్మకాలను కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... భారతదేశంలో అమల్లో ఉన్న ఆస్తి బదిలీ చట్టం, 1882లోని సెక్షన్ 44 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం, ఒక సహ యజమాని తన వాటాను వేరొకరికి బదిలీ చేయవచ్చు కానీ, మొత్తం ఆస్తిని అమ్మే అధికారం అతనికి ఉండదు. ఉదాహరణకు, ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద ఒక ఇల్లు ఉంటే, వారిలో ఒకరు తన 1/3వ వంతు వాటాను మాత్రమే అమ్మగలరు.
ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై ఒక కీలక తీర్పు వెలువరించింది. 2024 సెప్టెంబర్ 10న ఎస్.కె. గోలం లాల్చంద్ వర్సెస్ నందు లాల్ షా కేసులో, ఆస్తి విభజన (partition) జరిగి ఎవరి వాటా ఎంత అనేది స్పష్టంగా తేలే వరకు, ఒక సహ యజమాని మొత్తం ఆస్తిని అమ్మజూపితే అది చెల్లదని స్పష్టం చేసింది. వారసుల అనుమతి లేకుండా చేసిన అమ్మకాన్ని కోర్టు రద్దు చేసింది.
మోసం జరిగితే ఏం చేయాలి?
ఒకవేళ ఒక సహ యజమాని మోసపూరితంగా ఇతరుల సంతకాలు ఫోర్జరీ చేసి లేదా ఇతర యజమానుల వివరాలు దాచిపెట్టి ఆస్తిని అమ్మేస్తే, బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో అమ్మకాన్ని రద్దు చేయాలని కోరడంతో పాటు, మోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. అందువల్ల ఉమ్మడి ఆస్తిని కొనుగోలు చేసేవారు, అమ్మేవారు కూడా అన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, యజమానులందరి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.