వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన నయారా

Big relief for motorists Nayara reduces petrol and diesel prices
  • పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 5, డీజిల్‌పై రూ. 3 మేర తగ్గింపు
  • రెండేళ్లలో ఇంధన ధరలు తగ్గడం ఇదే తొలిసారి
  • దిగొచ్చిన అంతర్జాతీయ ముడి చమురు ధరలే కారణం
దేశవ్యాప్తంగా వాహనదారులకు నయారా ఎనర్జీ భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 5, డీజిల్‌పై లీటర్‌కు రూ. 3 చొప్పున కోత విధించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా రిటైల్ ఔట్‌లెట్లలో ఈ తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. గత రెండేళ్లలో దేశంలో ఒక ఇంధన రిటైల్ సంస్థ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, కీలకమైన సముద్ర మార్గాలు తిరిగి తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే నయారా ఎనర్జీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రాష్ట్రాల వారీగా ఉండే వ్యాట్ వంటి స్థానిక పన్నుల కారణంగా తుది రిటైల్ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.

నయారా ధరలను తగ్గించినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మాత్రం పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. దేశంలోని 90 శాతానికి పైగా ఇంధన మార్కెట్‌ను నియంత్రించే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( హెచ్‌పీసీఎల్‌ ) తమ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. ఢిల్లీలోని ఐఓసీ బంకుల్లో పెట్రోల్ లీటర్ రూ. 102.12, డీజిల్ రూ. 95.20 వద్ద స్థిరంగా ఉన్నాయి. 

కాగా, ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో మార్చి 26న నయారా పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 పెంచింది. తాజా తగ్గింపుతో ఆ పెంపును పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లయింది. మరోవైపు మే నెల ద్వితీయార్థంలో ప్రభుత్వ రంగ సంస్థలు పలు దఫాలుగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 7.50 చొప్పున పెంచడం గమనార్హం.
Nayara Energy
Petrol price cut
Diesel price reduction
Fuel prices India
Crude oil prices
Nayara fuel outlets

More Telugu News