ఆర్మీ కొత్త చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు.. 'విజయ్' మంత్రం ప్రకటన

General Dhiraj Seth takes charge as new Army Chief and announces VIJAY mantra
  • జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి ధీరజ్ సేథ్ బాధ్యతల స్వీకరణ
  • 'విజయ్' నినాదంతో తన ప్రాధాన్యతలను ప్రకటించిన కొత్త చీఫ్
  • నిఘా, ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, యోధుల సంక్షేమమే లక్ష్యమ‌ని వెల్ల‌డి
  • దేశ రక్షణకు సైన్యం ఎల్లప్పుడూ సిద్ధమని హామీ
భారత సైన్యం 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి, గౌరవం, దేశమే ప్రథమం అనే ఆదర్శాలకు కట్టుబడి సైన్యాన్ని నడిపిస్తానని స్పష్టం చేశారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సౌత్ బ్లాక్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన తండ్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఎం సేథ్‌కు ఆయన సెల్యూట్ చేయడం, ఆయన సోదరుడు రియర్ అడ్మిరల్ రవ్నీశ్ సేథ్ ఆయనకు సెల్యూట్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సందర్భంగా జనరల్ సేథ్ మాట్లాడుతూ.. 'విజయ్' (VIJAY) అనే నినాదంతో తన ప్రాధాన్యతలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో నిరంతర నిఘా (Vigilance), వినూత్న ఆవిష్కరణలు (Innovation), వైమానిక-నౌకాదళాలతో సమన్వయం (Jointness), ఆత్మనిర్భరత (Atmanirbharta), సైనికుల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యం (Yodha First) అనే ఐదు అంశాలే తన లక్ష్యాలని వివరించారు.

భారత సైన్యానికి నాయకత్వం వహించే గౌరవం, బాధ్యతను అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సాయుధ బలగాల కోసం ఇచ్చిన 'జై' (JAI - జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్) మంత్రమే తన 'విజయ్' ప్రాధాన్యతలకు పునాది అని, ఇది తమను విజయం వైపు నడిపిస్తుందని జనరల్ సేథ్ పేర్కొన్నారు.
Dhiraj Seth
Indian Army Chief
VIJAY Mantra Army
National War Memorial
Upendra Dwivedi
Indian Armed Forces

More Telugu News