రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు, ఏడుగురి సజీవ దహనం
- 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు
- అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణమని ప్రాథమిక అంచనా
- హరిద్వార్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఘటన
ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. హరిద్వార్ నుంచి ఇండోర్కు సుమారు 37-39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ వద్ద తెల్లవారుజామున 2:30 నుంచి 4:30 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. అతివేగంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో చాలామంది సమయానికి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు.
దౌసా ఎస్పీ పియూష్ దీక్షిత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఐదుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై మరణించారు. మృతుల్లో కొందరి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని ఆయన వెల్లడించారు. గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘోర దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.