శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం
- త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ గెలుపు
- అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- గెలుపు అంచున చేతులెత్తేసిన శ్రీలంక
- చివరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు
- ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో భారత్ ఏ విజయం
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత 'ఏ' జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్ సిమ్రన్ సింగ్ (2) కేవలం 16 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ (60)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజానికెత్తుకున్న రుతురాజ్ గైక్వాడ్ (101 పరుగులు, 114 బంతుల్లో) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. చివరి ఓవర్లలో ఆయుష్ బదోని (24), సూర్యాన్ష్ షెడ్గే (26*) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల స్కోరు సాధించింది.
లక్ష్య ఛేదనలో శ్రీలంక 'ఏ' దీటుగా బదులిచ్చింది. సహన్ అరాచ్చిగే (74) రాణించడంతో ఒక దశలో ఆ జట్టు విజయం ఖాయమనిపించింది. చివరి మూడు ఓవర్లలో కేవలం 17 పరుగులు అవసరమైన స్థితిలో లంక పటిష్ఠంగా కనిపించింది. అయితే, 48వ ఓవర్లో అన్షుల్ కంబోజ్ అద్భుతమైన యార్కర్తో అరాచ్చిగేను అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత అర్షద్ ఖాన్ కీలక వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక 'ఏ' 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది.
శతకంతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సిరీస్లో భారత్, శ్రీలంకతో పాటు ఆఫ్ఘనిస్థాన్ 'ఏ' జట్టు కూడా తలపడుతోంది.