తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. పౌరసరఫరాల శాఖ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్
- ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం
- సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ. 52
- పచ్చి బియ్యం కేజీ రూ. 50
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలిగిస్తూ పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని విక్రయించనున్నట్లు ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులను కాపాడేందుకు, ఏపీ ప్రజలకు అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
ఈ నిర్ణయం అమలు కోసం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారంటూ పవన్ కల్యాణ్ కొనియాడారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు.
ధరల వివరాలు:
బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం: కేజీ రూ. 52
గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్): కేజీ రూ. 50
బహిరంగ మార్కెట్ ధరలపై అత్యవసరంగా సమీక్షించి, రైస్ మిల్లర్లతో మాట్లాడి ప్రజలకు అందుబాటు ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం ఆఫీస్ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరు సామాన్యుల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.