విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తి.. మళ్లీ ఎందుకు బతికిస్తారు?: డోలా బాల వీరాంజనేయస్వామి
- ఏపీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న విజయసాయి
- సొంత పార్టీ నుంచే గెంటిబడ్డ వ్యక్తి విజయసాయి అని డోలా ఎద్దేవా
- జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని కూడా విజయసాయి గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ మంత్రి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజకీయ జీవితం ముగిసిపోయిన వ్యక్తి అని అన్నారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని విజయసాయి అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తిని ప్రజలు మళ్లీ ఎందుకు బతికిస్తారని ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. తన సొంత పార్టీ (వైసీపీ) నుంచే గెంటబడ్డ వ్యక్తి, మూడో ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతారని ఎద్దేవా చేశారు. గతంలో జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని విమర్శించారు.
అటు, దళిత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. తానే స్వయంగా అందరితో మాట్లాడానని, కూటమి ప్రభుత్వంపై అందరికీ పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.