వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అస్వస్థత
- పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిన బొత్స
- వెన్నుపోటు దినం కార్యక్రమం
- విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేత
- వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించిన పార్టీ కార్యకర్తలు, నేతలు
ఈ సంఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బొత్స అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
గతంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత కారణంగానే ఇలా జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. అనారోగ్యానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి, ఆ తర్వాత 2015లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. తాజాగా ఈ సంఘటనతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సీనియర్ వైసీపీ నాయకులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.