Advertisement

కర్ణాటకలో విజయ్ సినిమాకు కావేరి నీటి సెగ.. నిలిచిపోయిన ప్రదర్శనలు

Vijay movie screenings stopped in Karnataka due to Cauvery water dispute
  • కావేరి జలాల వివాదంతో కర్ణాటకలో విజయ్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత
  • తమిళనాడుకు నీటి విడుదలను వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాల నిరసనలు
  • థియేటర్ల వద్ద విజయ్ పోస్టర్లు, కటౌట్లను తొలగించిన యాజమాన్యాలు
కావేరీ జలాల వివాదం మరోసారి తమిళ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. తమిళ అగ్ర కథనాయకుడు, ముఖ్యమంత్రి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్ర ప్రదర్శనలు కర్ణాటక వ్యాప్తంగా నిలిచిపోయాయి. తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ అనుకూల సంఘాలు, రైతులు ఆందోళనలు చేపడుతుండటంతో, శాంతిభద్రతల దృష్ట్యా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా షోలను రద్దు చేశాయి.

జూలై 23న విడుదలైన ఈ చిత్రం కర్ణాటకలో సుమారు 125 నుంచి 150 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే, తాజా నిరసనల నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద విజయ్ పోస్టర్లు, బ్యానర్లను నిరసనకారులు తొలగించారు. బెంగళూరులోని ప్రముఖ ఊర్వశి థియేటర్‌లో పోలీసుల సూచన మేరకు ప్రదర్శనలు నిలిపివేసి, విజయ్ సినిమా స్థానంలో 'కరవళి' అనే కన్నడ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా థియేటర్ వద్ద పోలీసు బలగాలను మోహరించారు. మండ్యలో కన్నడ కార్యకర్తలు సినిమా ప్రమోషనల్ బ్యానర్లను చించివేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిణామాలపై చర్చించేందుకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ సమావేశం ఏర్పాటు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు, 15 రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అయితే, తమ రాష్ట్రంలోనే నీటి కొరత తీవ్రంగా ఉందని, ఈ నిర్ణయం వల్ల రైతులు నష్టపోతారని కన్నడ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు, కావేరి బోర్డు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పష్టం చేశారు.
Advertisement
Vijay
Cauvery water dispute
Karnataka protests
Jana Nayagan movie
Tamil cinema screenings

More Telugu News