'పద్మశ్రీ' నా బాధ్యతను పెంచింది: మంద కృష్ణ మాదిగ
- పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన గౌరవమన్న మంద కృష్ణ
- దేశ సమస్యల పరిష్కారమే తన తదుపరి లక్ష్యమని వ్యాఖ్య
- అన్ని వర్గాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్గీకరణ లక్ష్య సాధనకు చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, సమాజానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఎమ్మార్పీఎస్ ప్రధాన లక్ష్యం వర్గీకరణ అయినప్పటికీ, సమాజ శ్రేయస్సు కోసం అనేక ఇతర పోరాటాలు కూడా తాము కొనసాగిస్తున్నామని గుర్తుచేశారు.
భవిష్యత్ కార్యాచరణపై మంద కృష్ణ మాదిగ స్పష్టతనిస్తూ, "కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అనేక కీలక అంశాలపై దృష్టి సారిస్తాం. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందుకోసం మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాం" అని వివరించారు. దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పోరాడతామని, ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ మొదలుకొని వామపక్ష భావజాలం కలిగిన మేధావుల వరకు అందరినీ సంప్రదించి, వారి సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.