ఉత్తరాంధ్రలో ఏనుగుల దాడులకు చెక్.. కుంకీ శిబిరాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan inaugurates Kumki elephant camp to end elephant attacks in North Andhra
  • పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమిలో కుంకీ ఏనుగుల శిబిరం ప్రారంభం
  • మానవ-గజరాజుల ఘర్షణ నివారణకు ఇది కొత్త అధ్యాయం అన్న పవన్ కల్యాణ్
  • పలమనేరు తరహాలో ఇక్కడా సమస్యను పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రభుత్వం
  • నాలుగు కుంకీలను పంపిన కర్ణాటక ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు
ఉత్తరాంధ్రలో ఏళ్ల తరబడి రైతులను, ప్రజలను భయపెడుతున్న ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ-అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ శిబిరం ఏర్పాటు ఉత్తరాంధ్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన అభివర్ణించారు.

సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ప్రకృతి మనది కాదు, మనమే ప్రకృతిలో భాగం. కాబట్టి దానితో సామరస్యంగా జీవించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉన్నప్పుడే సుస్థిర ప్రగతి సాధ్యమవుతుంది" అని అన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో అడవుల నుంచి ఏనుగులు గ్రామాల్లోకి రావడం, రైతుల పంటలను నాశనం చేయడం, రాత్రిపూట ప్రజలు భయంతో జీవించడం వంటి సమస్యలు చాలాకాలంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతోనే 'గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియా'ను ఏర్పాటు చేశామని వివరించారు.

గతంలో చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో 'జయంత్', 'అభిమన్యు' అనే కుంకీ ఏనుగులు అటవీ శాఖ అధికారులతో కలిసి అద్భుతంగా పనిచేశాయని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో అక్కడ ఏనుగుల దాడుల్లో మరణాలను 70 శాతానికి పైగా తగ్గించామని, పంట నష్టాన్ని కూడా గణనీయంగా నివారించామని పేర్కొన్నారు. మన్యం జిల్లాలోనూ అలాంటి విజయాన్నే సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ శిబిరం కోసం నాలుగు కుంకీ ఏనుగులను పంపిన కర్ణాటక ప్రభుత్వానికి, ప్రజలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "ఏనుగులను బహుమతిగా ఇవ్వడాన్ని అక్కడి ప్రజలు తమ సంపదను పంచుకోవడంతో సమానంగా భావిస్తారు. ఇది వారి ఉదారతకు, స్నేహానికి నిదర్శనం. తెలుగు ప్రజల భద్రతపై ప్రేమతో ఏనుగులను పంపినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ఆయన అన్నారు. మానవులు, ఏనుగులు సామరస్యంగా సహజీవనం చేసేందుకు ఈ శిబిరం వేదికగా నిలుస్తుందని ఆశిస్తూ, దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
Advertisement
Pawan Kalyan
Kumki Elephant Camp
North Andhra Elephant Attacks
Parvathipuram Manyam District
Guchimi Elephant Holding Area
Human Wildlife Conflict

More Telugu News