కంగనా రనౌత్ క్షమాపణ చెప్పాలి: సీపీఐ నారాయణ
- యువత, మహిళలను ఉద్దేశించి కంగన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న నారాయణ
- బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని సూచన
- సమాజంలో విద్వేషాలు పెంచేలా మాట్లాడటం సరి కాదని వ్యాఖ్య
జెన్ జీ యువత, మహిళలను ఉద్దేశించి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో సమాజంలో భావోద్వేగాలను దెబ్బతీసిన కంగన... బాధితులైన యువతకు, మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించేటప్పుడు సంయమనం, బాధ్యత వహించాలని నారాయణ సూచించారు. సమాజంలో విభేదాలను పెంచి, ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కంగనా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
ఇదే క్రమంలో... గతంలో నిరసనకారులను ఉద్దేశించి చేసిన 'బొద్దింకలు' అనే వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించి, ఆ వ్యాఖ్యల వల్ల కలిగిన భావోద్వేగ బాధను గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడాన్ని నారాయణ అభినందించారు. తప్పును గుర్తించి దిద్దుకునే ఇటువంటి వైఖరి న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని, ఉన్నతమైన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.