KA Paul: ఎలాగైతేనేం... భారత్-పాక్ యుద్ధం ఆపాను: కేఏ పాల్

- భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు
- ఈ సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వైనం
- ఇరు దేశాల నేతలతో టచ్లో ఉన్నానని, ఎట్టకేలకు శుభవార్త వచ్చిందన్న కేఏ పాల్
- మే 24న జింఖానా మైదానంలో శాంతి సభకు హాజరుకావాలని పిలుపు
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ స్పందించారు. ఈ విషయంలో ఓ శుభవార్త అందిందని, తాను చేసిన శాంతి ప్రయత్నాలు ఫలవంతమయ్యాయని వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తాను పట్టువిడవకుండా అమెరికాలోని రిపబ్లికన్లు, డెమొక్రటిక్ పార్టీల నేతలతో పాటు, భారత్ మరియు పాకిస్థాన్ దేశాల నాయకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరిపానని పాల్ తెలిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగానే ఉద్రిక్తతలు చల్లబడే దిశగా, శాంతియుత వాతావరణం నెలకొనే దిశగా ఎట్టకేలకు శుభవార్త అందిందని పేర్కొన్నారు.
అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని చెప్పినా, నేను ఆశలను విడిచిపెట్టలేదు. ప్రార్థిస్తూనే ఉన్నా.. రాత్రీ పగలు పనిచేస్తూనే ఉన్నా" అని పాల్ అన్నారు. "యుద్ధం ద్వారా నష్టమే కానీ లాభం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. లక్షల మంది అమాయక ప్రజలు చనిపోతారు. లక్షల కోట్లు ఆస్తి నష్టం కలుగుతుంది" అని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉగ్రవాదులు దాడులు చేస్తే మాత్రం ఉపేక్షించకూడదని, అలాంటి చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సమసిపోయి, శాశ్వత శాంతి నెలకొనాలని ఆకాంక్షించే వారందరూ మే 24వ తేదీన సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో జరిగే శాంతి సభకు హాజరుకావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని బలంగా వినిపిద్దామని, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.