Kushendar Ramesh Reddy: దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో కుశేందర్ రమేశ్ రెడ్డికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు

- ‘రజాకార్’ చిత్రంలో తన విజువల్స్తో అందరినీ మెస్మరైజ్ చేసిన కుశేందర్ రమేశ్ రెడ్డి
- కేకే సెంథిల్ కుమార్ దగ్గర పలు చిత్రాలకు చీఫ్ అసోసియేట్గా పనిచేసిన కెమెరామెన్
- 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కెమెరామెన్గా నిలిచిన వైనం
‘రజాకార్’ చిత్రంలో తన విజువల్స్తో అందరినీ మెస్మరైజ్ చేశాడు సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేశ్ రెడ్డి. ఈ మూవీలోని విజువల్స్కు గుర్తింపు లభించింది. 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా కుశేందర్ రమేశ్ రెడ్డికి పురస్కారం లభించింది. కేకే సెంథిల్ కుమార్ దగ్గర ‘ఈగ’, ‘బాహుబలి 1’,‘బాహుబలి 2’ ‘ఆర్ఆర్ఆర్’ కి చీఫ్ అసోసియేట్గా పని చేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఇలా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కెమెరామెన్గా నిలిచారాయన.
చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని, ఎవ్వరికీ తెలియని వీర గాథల్ని యాటా సత్యనారాయణ ‘రజాకార్’ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. ఇక ఆయన విజన్కు కుశేందర్ రమేశ్ రెడ్డి కెమెరా తోడు అయింది. చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ చిత్రాన్ని మల్చడంలో ఆయన సినిమాటోగ్రఫీ ఎంతగానో ఉపయోగపడింది.
కదిలించే విజువల్స్తో మెప్పించిన కుశేందర్ రమేశ్ రెడ్డి... తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సినిమాటోగ్రఫర్గా అవార్డును అందుకున్నారు. ఇక, ప్రస్తుతం ఆయన వానర సెల్యులాయిడ్, డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న ‘బార్బరిక్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
అలాగే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ కథనంతో నాని దర్శకత్వంలో అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న 12A రైల్వే కాలనీ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ఈ సినిమాను ఎస్ఎస్ఎస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇలా చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుని తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
