పేపర్‌ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.. రాజ్యసభలోనూ ఆమోదం పొందిన బిల్లు

Public Examinations Bill 2026 receives Parliament approval to stop exam malpractices
  • రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి చట్టం
  • గరిష్ఠంగా రూ.10 కోట్ల జరిమానా
  • జైలు శిక్ష, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ
  • ఎన్‌టీఏపై ప్రతిపక్షం విమర్శలు
  • సమగ్ర సంస్కరణలపై కొనసాగుతున్న డిమాండ్‌
దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, పేపర్‌ లీక్‌లను అరికట్టడం లక్ష్యంగా తీసుకొచ్చిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు-2026కు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు గురువారం రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. దీంతో రాష్ట్రపతి అంగీకారం లభించగానే ఇది చట్టంగా అమల్లోకి రానుంది.

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చర్చ సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడీ వాదనలు జరిగాయి. పేపర్‌ లీక్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడానికే ఈ సవరణలు తీసుకొచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ జరిమానాలు, ప్రత్యేక కోర్టులు, వేగవంతమైన విచారణలతో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపింది.

ఈ సవరణల ప్రకారం పేపర్‌ లీక్‌లకు పాల్పడిన వారిపై గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. జైలు శిక్షతో పాటు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో విచారణ పూర్తి చేసే నిబంధనలను కూడా చేర్చారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ముఠాలపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంది.

2024లో తీసుకొచ్చిన చట్టం అమలులో వచ్చిన అనుభవాల ఆధారంగానే ఈ సవరణలు రూపొందించినట్లు జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 52 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. పేపర్‌ లీక్‌ల కారణంగా ఆత్మహత్యల సంఖ్య కూడా తగ్గిందని సభకు వివరించారు.

అయితే ప్రతిపక్షం మాత్రం బిల్లుపై విమర్శలు గుప్పించింది. కేవలం శిక్షలు పెంచడం సరిపోదని, పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని డిమాండ్‌ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పనితీరుపైనా ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు విద్యార్థుల ప్రయోజనాల కోసం కేంద్రం వేగంగా చర్యలు తీసుకుందని అధికార పక్షం పేర్కొంది. మాజీ విద్యాశాఖ మంత్రి రాజీనామా, నందన్‌ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు, నీట్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించడం వంటి చర్యలను ప్రస్తావించింది.
Advertisement
Public Examinations Amendment Bill 2026
Rajya Sabha
Paper leak law
Jitendra Singh
Exam transparency
Anti paper leak bill

More Telugu News