Chiranjeevi: అబ్బనీ తియ్యని దెబ్బ సాంగ్ గురించి ఆసక్తికర విషయం వెల్లడించిన మెగాస్టార్

- మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విడుదలై మే 9వ తేదీకి 35 ఏళ్లు
- ఈ నెల 9న రి రిలీజ్ చేసేందుకు సిద్ధమైన చిత్ర నిర్మాణ సంస్థ
- సినిమాలోని హిట్ సాంగ్ 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాటకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వైజయంతీ మూవీస్ నిర్మించిన క్లాసిక్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ నెల 9వ తేదీన ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధమయ్యాయి.
ఈ సందర్భంగా 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ రోజుకు కూడా ఎంతో ఆకర్షణీయంగా అనిపించే పాట 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' అని ఆయన అన్నారు. ఈ పాట ఒక్క రోజులో రికార్డింగ్ అయిందంటే చాలామంది ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు.
ఒక్క రోజు కూడా కాదు, ఉదయం 9 గంటలకు ఇళయరాజా గారు రికార్డింగ్ హాలు వద్ద కూర్చుని 11-12 గంటల మధ్య తాము పక్క సెట్లో షూట్ చేస్తుండగా, ఆ పాట బాగుందా వినండి అని ఒక ట్యూన్ (మొత్తం పాట కాదు) పంపించారని, వినగానే రాఘవేంద్రరావు గారికి, దత్తు గారికి, తనకు చాలా బాగా నచ్చిందని తెలిపారు.
"పాట చాలా బాగుంది.. సింపుల్గా ఉంది.. మంచి రిథమ్తో ఉంది. రిథమ్ కూడా చాలా కొత్తగా ఉందనిపించింది" అని ఆయన అన్నారు. వేటూరి గారితో కూర్చుని లంచ్ టైమ్లో 'అమ్మనీ కమ్మనీ దెబ్బ' అంటూ ఎంతో తియ్యగా ఉందో యబ్బా అంటూ ఆయన రాసిన పాటను ఆ తర్వాత బాలు గారు పాడటం జరిగిందని చిరంజీవి వెల్లడించారు.