మోదీ సర్కార్‌కు 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక

BJP marks 12 years of Modi govt at Centre
  • కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంకు 12 ఏళ్లు పూర్తి
  • దేశవ్యాప్తంగా '22 విజయాలు' ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రణాళిక
  • ఇది సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానంగా అభివర్ణించిన కమలదళం
  • 'విధానాల పక్షవాతం' నుంచి దేశం బయటపడిందని కేంద్ర మంత్రుల వ్యాఖ్య
  • వికసిత భారత్ లక్ష్యానికి ఈ 12 ఏళ్ల పాలనే పునాది అని స్పష్టీక‌ర‌ణ‌
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్న‌టితో 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ దశాబ్ద కాలానికి పైబడిన ప్రస్థానాన్ని సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభివర్ణించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వం సాధించిన '22 ముఖ్యమైన విజయాలను' ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ 12 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ పాలన, విదేశాంగ విధానంలో సాధించిన విజయాలు, సామాజిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలను ఈ ప్రచారం ద్వారా ప్రజలకు వివరించనున్నారు.

'సంకల్పం నుంచి సాఫల్యం' యాత్రగా అభివర్ణించిన నితిన్ నబిన్  
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ 12 ఏళ్ల ప్రస్థానాన్ని 'సంకల్పం నుంచి సాఫల్యం వరకు' సాగిన యాత్రగా అభివర్ణించారు. "2014 మే 26న ప్రారంభమైన ఈ శకం కేవలం ప్రభుత్వ మార్పు కాదు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం తిరిగి పొందిన ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి చారిత్రక ఘట్టం" అని ఆయన 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. 

'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' అనే మంత్రంతో పాటు అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వం పాలన సాగించిందని, సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చిందని అన్నారు. 'వికాస్ భీ, విరాసత్ భీ' (అభివృద్ధి, వారసత్వం) రెండింటినీ సమతుల్యం చేశారని, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం ద్వారా దేశం ఇప్పుడు మరింత సురక్షితంగా ఉందని తెలిపారు. 2047 నాటికి 'వికసిత భారత్' నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు.

మోదీ ఒక నిజమైన 'ప్రధాన్-సేవక్': రాజ్‌నాథ్ సింగ్  
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. 2014 మే 26న భారతదేశ అభివృద్ధి, నాగరిక ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. "ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమం నుంచి ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ పరివర్తన వరకు, మౌలిక సదుపాయాల నుంచి బలమైన జాతీయ భద్రత వరకు ప్రతి రంగంలోనూ దేశం అపూర్వమైన వేగంతో పురోగమించింది" అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వృద్ధి ఇప్పుడు మరింత విస్తృతమైనదిగా, సమ్మిళితమైనదిగా మారిందన్నారు. దశాబ్దాలుగా తెరమరుగైన కోట్లాది మంది ప్రజలు దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారని, మోదీ ఒక నిజమైన 'ప్రధాన్-సేవక్' అని కొనియాడారు.

ప్రజా సంక్షేమానికి ఒక 'స్వర్ణయుగం': శివరాజ్ సింగ్ చౌహాన్ 
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. గడిచిన 12 ఏళ్లు సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి అంకితమైనవని అన్నారు. ఒకప్పుడు దేశం ఎదుర్కొన్న 'విధానాల పక్షవాతం' నుంచి బయటపడి 'సంస్కరణ, పనితీరు, పరివర్తన' (Reform, Perform, Transform) మంత్రంతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ కాలాన్ని భారతదేశ పునర్నిర్మాణానికి, ప్రజా సంక్షేమానికి ఒక 'స్వర్ణయుగం'గా అభివర్ణించారు. జన్ ధన్ ఖాతాల నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు, పీఎం ఆవాస్ యోజన నుంచి డిజిటల్ ఇండియా వరకు ఎన్నో పథకాలతో ప్రధాని మోదీ అభివృద్ధి, సంక్షేమాలలో కొత్త అధ్యాయాన్ని లిఖించారని ప్రశంసించారు.
Go Back to Shorts
PM Modi
Narendra Modi
Modi government
BJP
12 years Modi
NDA government
Good governance
Development
National transformation
Welfare schemes
Digital governance

More Telugu News