పుస్తకాలు కొనుగోలు చేయాలని పాఠశాలల ఒత్తిడి.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

పుస్తకాలు కొనుగోలు చేయాలని పాఠశాలల ఒత్తిడి.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

National Human Rights Commission Angered by Schools Pressuring Book Purchases
  • ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి
  • జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ
  • సుమోటోగా స్వీకరించిన కమిషన్
  • రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు
పుస్తకాలు కొనాలని ప్రైవేటు పాఠశాలలు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రైవేటు పాఠశాలలు పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను కొనుగోలు చేయాలని వివిధ ప్రైవేటు స్కూళ్లపై ఫిర్యాదులు వచ్చాయి.

ఈ ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ప్రైవేటు పాఠశాలల ఏకపక్ష నిర్ణయాలు, తల్లిదండ్రులపై మోపుతున్న ఆర్థిక భారంపై మానవ హక్కుల కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన కమిషన్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలలు కేవలం కమిషన్లు వచ్చే పబ్లికేషన్లనే కొనాలని బలవంతం చేయడంపై వివరణ కోరింది.

జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం, విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించాలని, అనవసరమైన ప్రైవేటు పబ్లికేషన్స్ పుస్తకాలను రుద్దకూడదని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను చాలా పాఠశాలలు పట్టించుకోవడం లేదని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలనే అమలు చేయాలని ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.

పాఠశాల ఆవరణలోనే లేదా ప్రత్యేక దుకాణాల్లోనే పుస్తకాలు కొనుగోలు చేయాలనే ఒత్తిడి చేయకూడదని తెలిపింది. ప్రైవేటు పాఠశాలల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాల విద్యా శాఖ కార్యదర్శులను కమిషన్ ఆదేశించింది.
Advertisement
National Human Rights Commission
Private Schools
Textbooks
School Books
Education
India

More Telugu News