Team India: టీ20 వరల్డ్ కప్ ఫైనల్: టీమిండియా గెలవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు, పూజలు

Team India T20 World Cup Final Prayers Across India
  • నేడు అహ్మదాబాద్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ ఢీ
  • అభిమానుల తాకిడితో అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు, విమాన ఛార్జీలు ఆకాశంలో
  • టీమిండియా గెలవాలని దేశవ్యాప్తంగా హోమాలు, ప్రత్యేక పూజలు
  • మూడోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్, తొలి కప్ కోసం కివీస్ పోరాటం
  • మ్యాచ్‌కు ముందు రిక్కీ మార్టిన్, ఫల్గుణి పాఠక్‌లతో గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ
దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఈ తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో దేశవ్యాప్తంగా క్రికెట్ జ్వరం పతాకస్థాయికి చేరింది. టీమిండియా విజయం కోసం ఒకవైపు ప్రార్థనలు, హోమాలు జరుగుతుండగా, మరోవైపు లక్షలాది మంది అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు అహ్మదాబాద్‌కు పరుగులు తీస్తున్నారు.

క్రికెట్ అభిమానుల తాకిడితో అహ్మదాబాద్ నగరం జనసంద్రంగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల నుంచి విమాన ఛార్జీలు ఆకాశాన్నంటాయి. టికెట్ల కొరత తీవ్రంగా ఉండటంతో భారతీయ రైల్వే రంగంలోకి దిగింది. న్యూఢిల్లీ నుంచి సబర్మతికి, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతోంది. నగరంలోని హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి. 1.3 లక్షల సీటింగ్ సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం పూర్తిగా నిండిపోతుందని అంచనా. "భారత్ కచ్చితంగా ఫైనల్ చేరుతుందని నమ్మకంతో రెండు వారాల ముందే టికెట్లు బుక్ చేసుకున్నాను" అని ఓ అభిమాని తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.

మరోవైపు, టీమిండియా ట్రోఫీని నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా పూజా కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఉజ్జయిని మహాకాలేశ్వరాలయంలో సాధువులు భారత ఆటగాళ్ల పోస్టర్లతో ప్రత్యేక హోమం నిర్వహించారు. వారణాసి, కాన్పూర్‌లలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. కొందరు అభిమానులు ఇంట్లోనే పూజా మండపం ఏర్పాటు చేసి, ఆటగాళ్ల ఫోటోల ముందు దీపాలు, కలశాలతో పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై డబ్బావాలా అసోసియేషన్ సభ్యులు సైతం గణేశుడికి ప్రత్యేక పూజలు చేసి, "ఒత్తిడిని జయించి ఆడితే భారత్ ట్రోఫీ గెలుస్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా, మొత్తం మూడుసార్లు టీ20 కప్ సాధించిన తొలి జట్టుగా, స్వదేశంలో కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కనుంది. అయితే, న్యూజిలాండ్ మాత్రం తమ తొలి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్‌పై ఆడిన మూడు మ్యాచుల్లోనూ కివీస్ గెలవడం ఆ జట్టుకు సానుకూలాంశం కాగా, ఇటీవలే జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ను 4-1తో గెలవడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ముగింపు వేడుకల్లో అంతర్జాతీయ గాయకుడు రికీ మార్టిన్, ఫల్గుణి పాఠక్, సుఖ్‌బీర్ తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. సరిగ్గా 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఈ హోరాహోరీ పోరులో గెలిచి చరిత్ర సృష్టించేది ఎవరోనని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Team India
T20 World Cup 2026
India vs New Zealand
Narendra Modi Stadium
Cricket fans
Ricky Martin
Final Match
Ahmedabad
T20 World Cup final
Prayers for India

More Telugu News