ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోనే సంతృప్తి: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari says true satisfaction comes from helping people in distress
  • ఎన్టీఆర్ ట్రస్ట్‌తో 29 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నట్లు వెల్లడి
  • కుప్పం ప్రజల ప్రేమాభిమానాలే మా కుటుంబానికి బలమని వ్యాఖ్య
  • నాలుగు రోజల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న భువనేశ్వరి
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో 29 ఏళ్లుగా తన ప్రయాణం ప్రజాసేవకే అంకితమైందని ఆమె తెలిపారు. కుప్పం ప్రజలు తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలే తమకు కొండంత బలమని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, వినికిడి సమస్య ఉన్న పలువురికి వినికిడి యంత్రాలను అందజేశారు.

మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి


కుప్పంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వయం ఉపాధికి చేయూత’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబం సంతోషంగా ఉండాలంటే అది మహిళల చేతిలోనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. "ఏమీ తెలియదు.. ఏమీ చేయలేను" అని భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేస్తే మహిళలు అనుకున్న లక్ష్యాలను సాధించగలరని భువనేశ్వరి సూచించారు.

చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టానని భువనేశ్వరి తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక చేయూత కల్పించాలనే లక్ష్యంతో కుప్పంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. కుప్పం మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌ కల్పించేందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ‘స్త్రీ శక్తి హస్తకళా స్టోర్’ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అక్కడి విక్రయాల ద్వారా వచ్చే లాభాన్ని తిరిగి మహిళలకే అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

సమష్టి కృషితో విజయం

ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలంటే సమష్టి కృషి ఎంతో కీలకమని భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు దాతలు అందిస్తున్న సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. చల్లపల్లి ఎన్టీఆర్ స్కూల్ తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుందని చెప్పారు. ఆ స్కూల్ ద్వారా అనాథ పిల్లలకు విద్యను అందిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు.

కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

మొదట కుప్పం హెచ్‌పీ రోడ్డులోని శ్రీ సాయిబాబా ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన టీడీపీ కార్యకర్తలు అన్నార్ బాషా, చిన్ని నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

శాంతిపురం మండలం కడపల్లిలోని తన నివాసంలో భువనేశ్వరి స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు వివరించిన సమస్యలను శ్రద్ధగా విన్న ఆమె, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవడమే తమ కుటుంబం ఎప్పటి నుంచో పాటిస్తున్న సేవా స్ఫూర్తి అని పేర్కొన్నారు.
Advertisement
Nara Bhuvaneswari
NTR Memorial Trust
Kuppam Visit
Women Empowerment
Social Service

More Telugu News