Bandi Sanjay: రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Writes Open Letter to Revanth Reddy on Unfulfilled Promises
  • ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదన్న బండి సంజయ్
  • రైతు భరోసా నిధులపై మీ మాట మీరే విస్మరిస్తారా అని ప్రశ్న
  • రైతు భరోసా నిధులు విడుదల చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదని ఆ లేఖలో విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీలివ్వడం, ఆ తర్వాత మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు జమ చేయలేదని విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికలు పూర్తికాగానే రైతు భరోసా నిధులు వేస్తామని మిర్యాలగూడ వేదికగా ఫిబ్రవరి 4న మీరే ప్రకటించారు, మీ మాటను మీరే విస్మరిస్తే ఎలా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. లక్షలాది మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మూడో విడతతో కలిపి రూ.27 వేల కోట్ల బకాయిలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తక్షణమే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. నిధులు విడుదల చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

పేదల ఇళ్లను కూల్చడంలో రేవంత్ రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్‌ను మించిపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Bandi Sanjay
Revanth Reddy
Telangana
Rythu Bharosa
Farmers
Congress Party
BJP
Municipal Elections

More Telugu News