కామారెడ్డి ఘర్షణల ఎఫెక్ట్: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
- కామారెడ్డి, బాన్సువాడ పర్యటనను అడ్డుకున్న పోలీసులు
- భూవివాదంపై కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
- ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు బీజేపీ నేతల అరెస్ట్
శనివారం కామారెడ్డిలో భూవివాదానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూకబ్జా ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలను నిరూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసరడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసి, దాడికి పాల్పడ్డారు.
పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని అరెస్టు చేయడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాంచందర్ రావు పర్యటన ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావించిన పోలీసులు, ఆయన్ను హైదరాబాద్లోనే హౌస్ అరెస్టు చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.