జాతీయ ర్యాంకుల్లో ఆంధ్రా యూనివర్సిటీ సత్తా.. అభినందించిన మంత్రి నారా లోకేశ్
- ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఆంధ్ర యూనివర్సిటీకి 4వ స్థానం
- స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల విభాగంలో రాష్ట్రంలోనే ప్రథమం
- గతేడాదితో పోలిస్తే మూడు స్థానాలు పైకి ఎగబాకిన ఏయూ
- ఇతర విభాగాల్లోనూ మెరుగైన ర్యాంకులు సాధించిన వైనం
గతేడాది ఇదే విభాగంలో 7వ స్థానంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, ఈసారి ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 4వ ర్యాంకును దక్కించుకోవడం విశేషం. కేవలం ఇదే కేటగిరీలో కాకుండా, ఇతర విభాగాల్లోనూ ఏయూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలతో కూడిన జాబితాలో గతేడాది 25వ స్థానంలో ఉండగా, ఈ సంవత్సరం 23వ స్థానానికి చేరుకుంది.
మరోవైపు, దేశంలోని కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో కూడిన ఓవరాల్ కేటగిరీలో ఏయూ తన 41వ స్థానాన్ని నిలబెట్టుకుంది. అలాగే, ఫార్మసీ విభాగంలో 34 నుంచి 31వ స్థానానికి, ఇంజనీరింగ్ విభాగంలో 90 నుంచి 88వ స్థానానికి మెరుగుపడింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల సైతం తన 16వ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది.
సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అభినందనలు తెలిపారు. ర్యాంకును మెరుగుపరుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, సుదీర్ఘ లక్ష్యాల సాధన కోసం మరింతగా కృషి చేయాలని యూనివర్సిటీ యాజమాన్యానికి, సిబ్బందికి సూచించారు.