Advertisement

ఆగని సైబరాసురుల ఆగడాలు.. 146 శాతం పెరిగిన ఎస్సెమ్మెస్‌ల స్కామ్‌లు

SMS scams in India increase by 146 percent says BioCatch report
  • 67 శాతం పెరిగిన మొబైల్‌ మోసాలు
  • ఐఓఎస్‌లో 86 శాతం అధికం
  • ఆండ్రాయిడ్‌లో 35 శాతం పెరుగుదల
  • 8.5 లక్షల మ్యూల్‌ అకౌంట్లు గుర్తింపు
  • రూ.22,496 కోట్ల సైబర్‌ ఫిర్యాదులు
  • రూ.9,055 కోట్ల మోసాలు అడ్డుకట్ట
దేశంలో ఎస్సెమ్మెస్‌ల ద్వారా జరిగే సైబర్‌ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 2026 తొలి అర్ధభాగంలో ఎస్సెమ్మెస్‌ల ఆధారిత మోసాలు 146 శాతం పెరిగినట్లు 'బయోక్యాచ్‌' నివేదిక వెల్లడించింది. ఇదే కాలంలో మొబైల్‌ ఫ్రాడ్‌ సెషన్లు 67 శాతం పెరిగినట్లు పేర్కొంది.

నివేదిక ప్రకారం ఐఓఎస్‌ పరికరాల్లో మొబైల్‌ మోసాలు 86 శాతం, ఆండ్రాయిడ్‌లో 35 శాతం పెరిగాయి. మరోవైపు వెబ్‌ బ్రౌజర్‌ల ద్వారా జరిగే మోసాలు మాత్రం 10 శాతం తగ్గాయి. దీంతో సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌ ఫోన్లనే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

మోసాల విలువ కూడా పెరుగుతోందని నివేదిక తెలిపింది. అనుమానాస్పద చెల్లింపులు రెట్టింపు కాగా, ఒక్కో మోసంలో బదిలీ అవుతున్న సగటు మొత్తం 1.7 రెట్లు పెరిగింది. అదే సమయంలో నేరగాళ్లు మరింత వేగంగా డబ్బులు కాజేస్తున్నారని, మోసపూరిత కాల్స్‌ సెషన్ల వ్యవధి తగ్గడమే అందుకు నిదర్శనమని విశ్లేషించింది.

2025లో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల 700కు పైగా శాఖల్లో 8.5 లక్షలకుపైగా ‘మ్యూల్‌ అకౌంట్లు’ గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే సైబర్‌ మోసాలకు సంబంధించి రూ.22,496 కోట్ల విలువైన ఫిర్యాదులు నమోదయ్యాయని, 26.48 లక్షల మ్యూల్‌ అకౌంట్‌ కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. అనుమానితుల రిజిస్ట్రీ ద్వారా రూ.9,055 కోట్ల మోసాలను అడ్డుకున్నట్లు పేర్కొంది.

యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ పెట్టుబడుల వినియోగం వేగంగా పెరగడంతో భారత డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ సైబర్‌ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారిందని నివేదిక పేర్కొంది. అయితే బ్యాంకులు, ఆర్‌బీఐ, ఐ4సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలు కలిసి పనిచేయడం వల్ల మోసాలను ముందుగానే గుర్తించే సామర్థ్యం మెరుగుపడుతోందని 'బయోక్యాచ్‌' వెల్లడించింది.
Advertisement
SMS Scams
BioCatch Report
Mobile Fraud India
Mule Accounts
Cyber Crime Statistics
Digital Payment Fraud

More Telugu News