Pakistan: ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. కౌన్సిల్ నుంచి తప్పుకుంటామంటూ పాక్ బోర్డు బెదిరింపులు

  • ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లైనా తమ దేశంలో నిర్వహించాలని డిమాండ్
  • లేదంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచీ తప్పుకుంటామంటున్న పీసీబీ
  • పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆసియా కప్ ను శ్రీలంకకు తరలిస్తున్న ఏసీసీ
PCB Threaten to Pull Out of ACC Pakistan Eager to Host 4 First Round Asia Cup 2023 Matches

తమ దేశం నుంచి తరలిపోతున్న ఆసియా కప్‌ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బెట్టు వీడటం లేదు. ఈ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లైనా తమ దేశంలో నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతోంది. మొదటి రౌండ్‌లోని నాలుగు మ్యాచ్‌లైనా పాక్‌లో ఆడించకుంటే టోర్నీలో తమ జట్టు ఆడదని, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నుంచి కూడా వైదొలుగుతామని బెదిరిస్తోంది.

సెప్టెంబర్‌లో ఆసియాకప్‌కు పాక్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాల కారణంగా టీమిండియాను పాక్ పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. దాంతో, భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో, మిగిలిన మ్యాచ్‌లు పాక్‌లో నిర్వహించేలా పీసీబీ హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రతిపాదించింది. కానీ, దీనికి ఏసీసీ సభ్య దేశాలు ఒప్పుకోలేదు. దాంతో, టోర్నీని పాక్‌ నుంచి తరలించి శ్రీలంకలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. దీనిపై పాక్ బోర్డు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. 

ఈ టోర్నీ తమ దేశంలో లేదంటే యూఏఈలో నిర్వహించాలని, శ్రీలంకలో జరిపేందుకు అంగీకరించేది లేదని చెబుతోంది. ఈ క్రమంలో ప్లాన్-బితో పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ.. ఏసీసీ అధికారులను సంప్రదించారు. ‘ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోవడంతో తమ ప్లాన్‌–బిలో భాగంగా కనీసం నాలుగు మ్యాచ్‌లైనా పాక్‌లో జరిపేలా చూడాలని పీసీబీ చైర్మన్‌ నజామ్‌ సేథీ.. ఏసీసీకి తెలిపారు. 

టోర్నీలో పాకిస్థాన్–నేపాల్‌, ఆఫ్ఘనిస్థాన్–బంగ్లాదేశ్‌, శ్రీలంక–ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక–బంగ్లాదేశ్ మ్యాచ్‌లు పాక్‌లో జరగాలని సేథీ కోరారు. ఫైనల్‌ సహా మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఏసీసీ ఈ ప్రతిపాదనను కూడా తిరస్కరిస్తే ఆసియా కప్‌లో పాక్ జట్టు ఆడదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి తమ దేశం కూడా వైదొలగదని స్పష్టం చేశారు’ అని పాక్ బోర్గు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆసియా కప్ ను పాక్ బహిష్కరిస్తే టోర్నీ ప్రాధాన్యత తగ్గిపోనుంది.

More Telugu News