passes away: సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ మృతి.. చంద్ర‌బాబు సంతాపం

  • హైదరాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో గుండెపోటుతో క‌న్నుమూత‌
  • సాహితీ వేత్త‌గా మంచి పేరు తెచ్చుకున్న ఎండ్లూరి
  • అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలు చేశార‌న్న చంద్ర‌బాబు
endury passes away

ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ నేటి తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో గుండెపోటుతో క‌న్నుమూశారు. ఎండ్లూరి సుధాకర్ 1959, జనవరి 21న నిజామాబాద్‎లోని పాములబస్తిలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయం-రాజమండ్రిలో ఆచార్యుడిగా 28 సంవత్సరాలు పని చేశారు.

కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా, ప‌లు హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగానూ వ్యవహరించారు. ఎండ్లూరి సుధాకర్ మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

''అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారి మరణం విచారకరం. సుధాక‌ర్ మృతి తెలుగు సాహితీ లోకానికే కాదు, దళిత సమాజానికి కూడా తీరని లోటు.

తెలుగు ఆచార్యునిగా ఎంద‌రో విద్యార్థులు, ప‌రిశోధ‌కుల‌కు మార్గ‌నిర్దేశం చేసిన ఎండ్లూరి సుధాకర్‌ గారి ఆత్మశాంతి కోసం భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

''తెలుగుదనం-దళిత కలం-హక్కుల గళం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి మృతి తెలుగు భాష, సాహిత్య రంగాలకి తీరని లోటు. పాఠాలతో విద్యార్థులను, రచనలతో సమాజాన్ని చైతన్యం చేసి అణగారిన దళితులకు అండగా నిలిచిన సుధాకర్ గారి స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం'' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News