Guntur District: గుంటూరు జిల్లా టీడీపీ నేత చంద్ర‌య్య దారుణ హ‌త్య‌.. కాసేప‌ట్లో వెల్దుర్తికి చంద్ర‌బాబు.. ఉద్రిక్త ప‌రిస్థితులు

  • గుంటూరు జిల్లా గుండ్లపాడులో క‌ల‌క‌లం
  • రాజకీయ ప్రత్యర్థుల మధ్య గొడ‌వ‌లు
  • ఉద‌యం బైకుపై వెళ్తున్న చంద్ర‌య్య‌ హత్య 
  • గ్రామంలో భారీగా పోలీసు బందోబ‌స్తు
murder in guntur

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య (36) దారుణ హత్యకు గురికావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కాసేప‌ట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చంద్రయ్య స్వగ్రామం గుండ్లపాడుకు వెళ్లి, మృత‌దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

పూర్తి వివ‌రాలు చూస్తే.. టీడీపీ నేత చంద్రయ్యకు ఆయ‌న‌ రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొంత కాలంగా గొడ‌వ‌లు ఉన్నాయి. చంద్రయ్య ఈ రోజు ఉద‌యం పని నిమిత్తం బైకుపై బయలుదేరి వెళ్లారు. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం చంద్ర‌య్య కోసం కాపు కాసిన ప్రత్యర్థులు బైక్‌కు ఓ కర్ర అడ్డుపెట్ట‌డంతో చంద్ర‌య్య కింద‌ప‌డిపోయారు.

దీంతో ఆయ‌న‌పై కత్తులు, కర్రలతో దాడి చేస్తూ విరుచుకుప‌డ‌డంతో చంద్ర‌య్య ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అనంతరం గుండ్ల‌పాడులో ఉద్రిక్తత నెలకొన‌డంతో మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని ప‌రిస్థితులు చేయి దాటిపోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆధిపత్యపోరే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. అయితే, పోలీసులు చాలా ఆల‌స్యంగా గ్రామానికి వ‌చ్చార‌ని చంద్ర‌య్య కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయ‌గా, త‌మ ప్రాంత టీడీపీ నేత‌ బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని తరలించ‌కూడ‌దంటూ కుటుంబ సభ్యులు అడ్డుప‌డ్డారు. దీంతో గుండ్ల‌పాడులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌లువురు టీడీపీ నేత‌లు ఆ గ్రామానికి త‌ర‌లివెళ్తున్నారు.

More Telugu News