India: రేపటి నుంచి విమానాలు తిప్పాలని కేంద్రం ప్లాన్... వద్దేవద్దంటున్న పలు రాష్ట్రాలు!

  • విమానాలు వద్దంటున్న మహారాష్ట్ర, తమిళనాడు
  • అదే దారిలో పశ్చిమ బెంగాల్ కూడా
  • కేసుల సంఖ్య పెరుగుతుందన్న భయాలు
  • అంగీకరించిన రాష్ట్రాలకు తిప్పుతామన్న కేంద్రం
Many States Says no to Flight Services

సోమవారం నుంచి పరిమిత సంఖ్యలో అయినా విమానాలను తిప్పాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించిన వేళ, పలు రాష్ట్రాలు ఇప్పడప్పుడే సర్వీసులు వద్దని స్పష్టం చేస్తుండటంతో, విమానాలు నడిచే విషయంలో అనిశ్చితి నెలకొంది. దేశంలో అత్యంత బిజీగా ఉండే ఎయిర్ పోర్టులను కలిగున్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేంద్రం ప్రణాళికలకు అడ్డు తగిలాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడి కాకపోవడంతో విమానాలకు అనుమతించేది లేదని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అంటున్నాయి.

తమ రాష్ట్రంలో మే 19 నాటి లాక్ డౌన్ ఆర్డర్ కు సడలింపులు ఇవ్వలేదని, కేవలం ప్రత్యేక విమానాలను మాత్రమే అనుమతిస్తామని మహారాష్ట్ర వ్యాఖ్యానించింది. దేశంలోనే అత్యధికంగా కేసులు తమ రాష్ట్రంలో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో విమానాల రాకపోకలకు ఓకే చెబితే కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, రెడ్ జోన్ గా ఉన్న ముంబైలో విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించాలనడం సరైన నిర్ణయం కాదని మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అభిప్రాయపడ్డారు.

ఇండియాలో కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న తమిళనాడు సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. కనీసం ఈ నెలాఖరు వరకూ విమాన సర్వీసులు వద్దని కేంద్రాన్ని కోరింది. అటు కరోనా కేసులతో పాటు, ఇటు ఎమ్ ఫాన్ బీభత్సాన్ని చూసిన పశ్చిమ బెంగాల్ 30 వరకూ విమానాలను కోల్ కతాకు పంపవద్దని అంటోంది. ఈ మేరకు తాను కేంద్రానికి ఓ లేఖను రాస్తానని, కోల్ కతా విమానాశ్రయానికి బదులుగా బడోగ్రా ఎయిర్ పోర్టుకు విమానాలు పంపాలని కోరుతానని ఆమె తెలిపారు.

ఇక విమానాల్లో ఎయిర్ పోర్టుకు చేరుకున్నా, వారు గమ్యస్థానాలకు ఎలా వెళ్లాలన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉదాహరణకు ముంబైలో ఇంకా ప్రజా రవాణాకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో దిగిన వారిని బయటకు ఎలా పంపాలి? వేరే ప్రాంతానికి వెళ్లాలని వచ్చిన వారుంటే, వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటి? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.

పలు రాష్ట్రాలు విమానాలకు అనుమతించే విషయమై నిర్ణయాధికారాన్ని తమకే ఇవ్వాలని కోరుతున్నాయని వెల్లడించిన పౌరవిమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పురి, కొన్ని విమానాలను సోమవారం నుంచి తిప్పుతామని, అంతర్జాతీయ సర్వీసులను మాత్రం జూన్ లో ప్రారంభిస్తామని వెల్లడించారు. విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంగీకరించిన అన్ని రాష్ట్రాల ఎయిర్ పోర్టులకు దేశవాళీ విమానాలు వెళతాయని స్పష్టం చేశారు.

More Telugu News