Manchu Manoj: తనకు విడాకులు మంజూరైన విషయాన్ని బాధతో వెల్లడించిన మంచు మనోజ్!

షార్ట్స్‌లో చూడండి
యువ నటుడు మంచు మనోజ్ కు విడాకులు మంజూరయ్యాయి. గతకొంతకాలంగా ఆయన వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనైంది. భార్యతో విభేదాల కారణంగా మంచు మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. సినిమాలు కూడా తగ్గించేశారు. అయితే సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో, తన జీవితంలో అతి ముఖ్యమైన మార్పు గురించి పంచుకున్నారు. తనకు విడాకులు మంజూరయ్యాయని, తన వివాహం అధికారికంగా ఓ ముగింపునకు వచ్చిందని తెలిపారు.

సీనియర్ నటుడు మోహన్ బాబు చిన్నకొడుకైన మనోజ్ 2015 మే 20న ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. కలిసి ఉండడం కష్టమని భావించి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.

తనకు విడాకులు మంజూరయ్యాయని, ఎంతో అందంగా అల్లుకున్న బంధం ముగిసిందని చెప్పడానికి హృదయం బరువెక్కిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా వెంటనిలిచింది అభిమానులేనని మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో సమస్యలు తొలగిపోయాయని భావిస్తున్నానని, ఇకమీదట తనకెంతో ఇష్టమైన సినిమా రంగంలోకి మళ్లీ వచ్చేస్తున్నానని ప్రకటించారు.

Go Back to Shorts
Manchu Manoj
Tollywood

More Telugu News