బీచ్లను కూడా మద్యం కేంద్రాలుగా మారుస్తారా?: జగన్
- బీచ్ షాక్స్ పేరుతో కొత్త మద్యం సంస్కృతికి తెరలేపుతున్నారన్న జగన్
- సామాన్య కుటుంబాలు బీచ్లకు ఎలా వెళ్తాయని ఆవేదన
- రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శ
"కుటుంబాలు, చిన్నారులతో కలిసి ప్రశాంతంగా గడిపే బీచ్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదు. బీచ్ షాక్స్ పేరుతో కొత్త మద్యం సంస్కృతికి తెరలేపుతోంది" అంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర సామాజిక వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తే, రేపు సామాన్య కుటుంబాలు బీచ్లకు ఎలా వెళ్తాయని కూటమి సర్కార్ను నిలదీశారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం, చివరకు లాకప్ డెత్లకు పాల్పడటం వంటి దారుణాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా? అని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించే చేతగాని ఈ ప్రభుత్వం... కేవలం అవినీతి, దోపిడీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. "రాష్ట్రానికి కొత్తగా విదేశీ పెట్టుబడులు రావడం లేదు కానీ, ఇక్కడ దోచుకున్న సొమ్ము మాత్రం విదేశాలకు వెళ్తోంది" అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.