రాముడి హుండీకే కన్నం.. కుంభమేళా సమయంలోనే అసలు దోపిడీ!

Ayodhya Ram Mandir donation scam during Kumbh Mela
  • అయోధ్య రామ మందిర విరాళాల్లో భారీగా అవినీతి
  • కుంభమేళా సమయంలోనే అత్యధిక నిధులు చోరీ
  • బావ, బావమరిది కీలక సూత్రధారులుగా వెల్లడి
  • ఈ కేసులో 8 మంది అరెస్ట్, రూ.79 లక్షలకు పైగా రికవరీ
  • నైతిక బాధ్యత వహిస్తూ ఇద్దరు ట్రస్ట్ సభ్యుల రాజీనామా
అయోధ్య రామమందిరం భక్తులు సమర్పించిన విరాళాల్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 2025 మహా కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ, విరాళాలు ప్రవాహాన్ని ఆసరాగా చేసుకుని భారీగా నిధులు పక్కదారి పట్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో బావ, బావమరిది అయిన అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా కీలక సూత్రధారులుగా ఉన్నారని, నిధులను దారి మళ్లించడంలో వీరే ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు ధృవీకరించారు.

ఈ కేసుకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జరిగే నగదు లెక్కింపు ప్రక్రియలోని లొసుగులని ఆసరాగా చేసుకుని నిందితులు చేతివాటం ప్రదర్శించారు. సీసీటీవీ కెమెరాల కంటపడకుండా దుప్పట్లలో నగదును దాచి తరలించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ప్రధాన నిందితులైన అనుకల్ప్, లవకుశ్ దొంగిలించిన సొమ్ముతో ఫామ్‌హౌస్, రూ.65 లక్షల విలువైన ఇల్లు మరియు పలు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా, స్కార్పియో వంటి విలాసవంతమైన కారును కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. వారి జీవనశైలిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులే పోలీసుల అనుమానాలకు కారణమయ్యాయి.

ఈ కుంభకోణం నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, నిందితుల తరఫున వాదించబోమని అయోధ్య న్యాయవాదులు సంఘం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతోంది. భక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన విరాళాల దుర్వినియోగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Ayodhya Ram Mandir
Donation Scam
Anukalp Mishra
Kumbh Mela 2025
Champat Rai

More Telugu News