ఏపీ అమ్మాయిలు టీమిండియాలో ఆడాలి: మంత్రి నారా లోకేశ్

ఏపీ అమ్మాయిలు టీమిండియాలో ఆడాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says AP girls should play for Team India
  • మంగళగిరిలో మహిళల ఏపీఎల్ ప్రారంభంపై మంత్రి లోకేశ్ హర్షం
  • ఏపీ అమ్మాయిలు జాతీయ జట్టుకు ఆడాలన్నదే లక్ష్యమని వెల్లడి
  • ట్రోఫీని ఆవిష్కరించిన నారా బ్రాహ్మణి, బ్రాండ్ అంబాసిడర్ మిథాలీ రాజ్
  • వేదిక కల్పించిన ఏసీఏకు లోకేశ్ అభినందనలు
  • ఏపీ నుంచి భవిష్యత్ ఛాంపియన్లు వస్తారని ఆశాభావం
ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానం సంపాదించాలన్నదే తన ఆకాంక్ష అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళా క్రికెటర్ల కలలను సాకారం చేసేందుకు తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) ఒక బలమైన వేదిక అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

శనివారం సాయంత్రం మంగళగిరిలో డబ్ల్యూఏపీఎల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టోర్నమెంట్ ట్రోఫీని నారా బ్రహ్మణి, భారత మహిళా క్రికెట్ దిగ్గజం, టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ మిథాలీరాజ్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ టోర్నీ ప్రారంభంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. "మంగళగిరిలో తొలి మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. యువ మహిళా క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి డబ్ల్యూఏపీఎల్ బలమైన పునాది వేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మిథాలీరాజ్‌కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారిణులకు డబ్ల్యూపీఎల్, ఆ తర్వాత టీమిండియాకు ఆడే మార్గాన్ని సుగమం చేస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను లోకేశ్ అభినందించారు. టోర్నీలో పాల్గొంటున్న నాలుగు జట్లకు, ప్రతి క్రీడాకారిణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్ ఛాంపియన్లు ఆవిర్భవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
Advertisement
Nara Lokesh
Women Andhra Premier League
Mithali Raj
Andhra Cricket Association
Mangalagiri
WAPL

More Telugu News