అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. భారత పతాకధారులుగా పవన్ సెహ్రావత్, మను భాకర్

అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. భారత పతాకధారులుగా పవన్ సెహ్రావత్, మను భాకర్

Grand opening of Asian Games Pawan Sehrawat and Manu Bhaker as Indian flag bearers
  • జపాన్‌లో నేటి నుంచి 2026 ఆసియా క్రీడలు
  • భారత పతాకధారులుగా కబడ్డీ ప్లేయర్ పవన్, షూటర్ మను భాకర్
  • తాజిందర్‌పాల్ స్థానంలో అనూహ్యంగా పవన్‌కు దక్కిన అవకాశం
  • ఈ క్రీడల్లో 36 క్రీడాంశాల్లో 503 మంది భారత అథ్లెట్ల పోటీ
  • గత రికార్డును అధిగమించడమే లక్ష్యంగా బరిలోకి భారత్
జపాన్‌లోని ఐచి-నగోయాలో 20వ ఆసియా క్రీడలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాలోమా మిజుహో స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకల్లో భారత బృందానికి పతాకధారులుగా కబడ్డీ ప్లేయర్ పవన్ సెహ్రావత్, ఒలింపిక్ పతక విజేత మను భాకర్ వ్యవహరించారు. వీరిద్దరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని ముందుండి నడిపించారు.

ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తరఫున 36 క్రీడల్లో 503 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. వాస్తవానికి పురుషుల విభాగంలో ఫ్లాగ్ బేరర్‌గా షాట్‌పుటర్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్‌ను ఎంపిక చేశారు. అయితే, అతడికి సంబంధించిన సెరిమోనియల్ కిట్ సకాలంలో అందకపోవడంతో వేడుకకు హాజరు కాలేకపోయాడు. 

దీంతో అతడి స్థానంలో పవన్ సెహ్రావత్‌కు ఈ గౌరవం దక్కింది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత కబడ్డీ జట్టులో పవన్ సభ్యుడిగా ఉన్నాడు. మహిళల విభాగంలో పతాకధారిగా వ్యవహరించిన మను భాకర్, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. 

స్వతంత్ర భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఈ క్రీడల్లో ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో పోటీపడనుంది.

గతంలో హాంగ్‌జౌ 2022 ఆసియా క్రీడల్లో 107 పతకాలతో రికార్డు సృష్టించిన భారత్, ఈసారి ఆ ప్రదర్శనను అధిగమించి మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement
Pawan Sehrawat
Manu Bhaker
Asian Games 2026
Aichi Nagoya Asian Games
Indian Flag Bearers
Paloma Mizuho Stadium

More Telugu News