సొంత నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన.. సోమవారం నుంచే!

సొంత నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన.. సోమవారం నుంచే!

Pawan Kalyan visit to his own constituency from Monday
  • పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్
  • రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • రూ. 200 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్‌కు శ్రీకారం
  • మహిళా సంఘాలకు రూ. 120 కోట్ల రుణాలు, మత్స్యకారులకు ఆధునిక పరికరాల పంపిణీ
  • తాగునీటి పథకాలు, రోడ్ ఓవర్ బ్రిడ్జి వంటి కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, సుమారు రూ. 1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పర్యటనలో భాగంగా సోమవారం, రూ. 9.59 కోట్లతో ఆధునికీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని పవన్ కల్యాణ్ ప్రజలకు అంకితం చేయనున్నారు. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పథకం ద్వారా చివరి గ్రామాలకు నీరు అందడం లేదన్న సమస్యకు ఈ ఆధునికీకరణతో పరిష్కారం లభించనుంది. దీని ద్వారా 52 ఆవాసాల్లోని సుమారు 97 వేల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. దీంతో పాటు, పిఠాపురం పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం కోసం ఏర్పాటు చేసిన 'పీఠికాపుర వనం', చందుర్తి-తాటిపర్తి బీటీ రోడ్డును కూడా ఆయన ప్రారంభించనున్నారు.

మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో నియోజకవర్గ రూపురేఖలు మార్చే కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురం ప్రజల చిరకాల వాంఛ అయిన రూ. 200 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రూ. 80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్, రూ. 118 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జి, రూ. 323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ వంటి భారీ పనులకు ఆయన శ్రీకారం చుడతారు. వీటితో పాటు జల్ జీవన్ మిషన్, అమృత్ 2.0 పథకాల కింద పలు తాగునీటి ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపనున్నారు.

ఈ అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా పవన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాలను అందజేయనున్నారు. ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారులకు ఆధునిక లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు, ఐస్ బాక్సులతో కూడిన మోటార్ సైకిళ్లను పంపిణీ చేసి వారి జీవనోపాధికి భరోసా కల్పించనున్నారు. అదేవిధంగా, 89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు అందించి వారి భూములపై హక్కులు కల్పించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటన ద్వారా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి పవన్ కల్యాణ్ పటిష్ఠమైన పునాదులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Advertisement
Pawan Kalyan
Pithapuram
Andhra Pradesh Deputy CM
Pithapuram Development Projects
Jana Sena Party
Uppada Sea Wall

More Telugu News