తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే విషప్రచారాన్ని ఆపండి: రోజా
- వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ వార్తలను ఖండించిన రోజా
- భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని వ్యాఖ్య
- జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీపై సాగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వామివారి ప్రసాదాలు అత్యంత పవిత్రమైనవని... కేవలం రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో కోట్లమంది భక్తుల నమ్మకాలతో, భావోద్వేగాలతో ఆడుకోవడాన్ని కూటమి నేతలు తక్షణమే కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ నిజమేంటో స్పష్టంగా బయటపడిందని పేర్కొన్న రోజా... జగన్ హయాంలో కల్తీ జరిగిందంటూ వైసీపీపై చేస్తున్న విషప్రచారానికి స్వస్తి పలకాలన్నారు. జగన్ పాలన పచ్చిపాలు లాంటిదని, అక్కడ కల్తీకి ఎంతమాత్రం ఆస్కారం లేదని అన్నారు. నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి ట్యాంకర్లను టీటీడీ బోర్డు తనిఖీల్లోనే తిరస్కరించి వెనక్కి పంపినప్పుడు, ఆ నెయ్యి ప్రసాదాల్లో కలవలేదని స్పష్టమవుతున్నా, జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారం చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనని రోజా తన పోస్ట్లో నిలదీశారు.