బ్రిక్స్‌ సదస్సుతో ప్రపంచ వేదికపై భారత్‌ స్థానం మరింత బలోపేతం!

బ్రిక్స్‌ సదస్సుతో ప్రపంచ వేదికపై భారత్‌ స్థానం మరింత బలోపేతం!

India position on global stage further strengthened by BRICS Summit
  • బ్రిక్స్‌ సదస్సు నిర్వహణలో భారత దౌత్యంపై డైరెక్టస్‌ ప్రత్యేక నివేదిక
  • పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండించడంతో భారత వాదనలకు లభించిన మద్దతు
  • క్వాడ్‌లో ఉంటూనే బ్రిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు 'డైరెక్టస్‌' ప్రస్తావన
  • అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూ రష్యాతో భాగస్వామ్యం కీలకమని వ్యాఖ్య
  • భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. భారత్‌ తన భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించిందని వెల్లడి
న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్‌ సదస్సు తర్వాత అంతర్జాతీయ వేదికపై భారత్‌కు దౌత్యపరమైన ప్రాధాన్యం మరింత స్పష్టమైందని ‘డైరెక్టస్‌’ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 2025 పహల్గామ్‌ ఉగ్రదాడిని బ్రిక్స్‌ న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో తీవ్రంగా ఖండించడం, సరిహద్దు దాటి ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు, సురక్షిత స్థావరాలకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి తీసుకోవడం భారత్‌ చాలాకాలంగా ప్రస్తావిస్తున్న అంశాలకు మద్దతు లభించినట్లయిందని తెలిపింది.

పహల్గామ్‌ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని బ్రిక్స్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా నేరపూరితమైనదిగా, సమర్థించలేనిదిగా పేర్కొన్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడినవారితో పాటు వారికి మద్దతు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిక్లరేషన్‌ స్పష్టం చేసింది.

అయితే డిక్లరేషన్‌లో పాకిస్థాన్‌ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఈ అంశాన్ని దాచాల్సిన అవసరం లేదని, అదే సమయంలో అతిగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని ‘డైరెక్టస్‌’ పేర్కొంది. వివిధ భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు ఉన్న దేశాలు కలిసి ఉగ్రవాదంపై ఇలాంటి భాషను అంగీకరించడం భారత్‌కు దౌత్యపరంగా ముఖ్యమైన పరిణామమని విశ్లేషించింది.

ఉగ్రవాదాన్ని కేవలం దాడి చేసిన వ్యక్తితో మాత్రమే పరిమితం చేయలేమని నివేదిక పేర్కొంది. ఆయుధాలు, శిక్షణ, నిధులు, సమాచార వ్యవస్థలు, నియామక నెట్‌వర్క్‌లు, సురక్షిత ప్రాంతాల వంటి మొత్తం వ్యవస్థపై చర్యలు అవసరమని తెలిపింది. ఈ అంశాలపై బ్రిక్స్‌ డిక్లరేషన్‌లో వచ్చిన ప్రస్తావన ప్రాధాన్యమైనదని పేర్కొంది.

అదే సమయంలో భారత్‌ అనుసరిస్తున్న బహుముఖ విదేశాంగ విధానాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. అమెరికాతో సంబంధాలను విస్తరిస్తూనే రష్యాతో భాగస్వామ్యాన్ని భారత్‌ కొనసాగిస్తోంది. క్వాడ్‌లో సభ్యత్వంతో పాటు బ్రిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. చైనాతో విభేదాలు ఉన్నప్పటికీ.. జాతీయ ప్రయోజనాలకు అవసరమైన చోట ఆ దేశంతో చర్చలు కొనసాగిస్తోంది.

వివిధ దేశాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. భారత్‌ తన భద్రతకు సంబంధించిన అంశాలను బ్రిక్స్‌ వంటి వేదికపై చర్చకు తీసుకురాగలిగిందని ‘డైరెక్టస్‌’ విశ్లేషించింది. దీనివల్ల ఏ ఒక్క భౌగోళిక రాజకీయ కూటమిపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించే దేశంగా భారత్‌ తన దౌత్యపరమైన స్థాయిని మరింత స్పష్టంగా చూపించిందని నివేదిక పేర్కొంది.
Advertisement
India
BRICS Summit 2025
Pahalgam terror attack
New Delhi Declaration
Counter terrorism
Indian foreign policy

More Telugu News